కరోనా ఎఫెక్ట్... చైనా ఉత్పత్తులపై నిషేధం విధించిన రెండు రాష్ట్రాలు

  • చైనా ఉత్పత్తులపై నిషేధం విధించిన మణిపూర్, మిజోరాం
  • ఆహార ఉత్పత్తులు, బట్టలపై తాత్కాలిక నిషేధం
  • రేపటి నుంచి అమల్లోకి రానున్న నిషేధం
కరోనా వైరస్ బారిన ఇప్పటి వరకు దాదాపు 34 వేల మంది పడ్డారు. 700 మందికి పైగా చనిపోయారు. మన దేశంలో కూడా చైనాకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సిబ్బందిని అలర్ట్ చేశాయి. మరోవైపు, చైనాకు ఆనుకుని ఉన్న మణిపూర్, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

చైనా నుంచి దిగుమతి అయ్యే బట్టలు, ఆహార ఉత్పత్తులపై మణిపూర్, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ఈ నిషేధం రేపటి నుంచే అమల్లోకి రాబోతోంది. అంతేకాదు చైనా, మయన్మార్ సరిహద్దుల్లో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా నుంచి మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. వీరిని ఇంట్లోనే ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. ఇతరులెవరినీ వారితో కలవనీయడం లేదు.
Go Back to Shorts
Corona Virus
China Products
Ban
Manipur
Mizoram
india
China

More Telugu News